ఎయిరిండియాలో మరో విడత వీఆర్ఎస్​

ఎయిరిండియాలో మరో విడత వీఆర్ఎస్​

టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా మరోసారి స్వచ్ఛంద విరమణ పథకాన్ని (వీఆర్​ఎస్​) ప్రకటించింది. గతేడాది జూన్‌లో తొలి విడత వీఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రకటించింది. ఫ్లయింగ్‌, నాన్ ఫ్లయింగ్‌ సిబ్బందికి ఈ పథకాన్ని వర్తింపజేసింది. మొత్తం 4,200 మంది ఈ పథకానికి అర్హులు కాగా, అందులో 1500 మంది వీఆర్‌ఎస్‌ను ఎంచుకున్నారు. ఇతరులకు వీఆర్‌ఎస్‌ వర్తింపజేయాలన్న ఉద్యోగుల కోరిక మేరకు రెండో విడత ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు ఎయిరిండియా చీఫ్‌ హెచ్ఆర్‌ సురేశ్‌ దత్‌ త్రిపాఠి తెలిపారు. తాజాగా నాన్- ఫ్లయింగ్‌ స్టాఫ్‌కు ఈ పథకాన్ని ఎంచుకునే అవకాశం కల్పించింది. 

ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 40 ఏళ్లు దాటిన పర్మినెంట్‌ జనరల్‌ కేడర్‌కు చెందిన ఉద్యోగులు, క్లరికల్‌, నైపుణ్యం లేని కేటగిరీలకు చెందిన ఉద్యోగులకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈనెల 17 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు వీఆర్​ఎస్​కు దరఖాస్తుకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. ఈనెల 31వ తేదీ లోపు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటే ఎక్స్‌గ్రేషియా మొత్తంపై రూ.1లక్ష అదనంగా చెల్లిస్తామని తెలిపింది. తాజాగా స్వచ్ఛంద విరమణ పథకానికి దాదాపు 2,100 ఉద్యోగులు అర్హులుగా ఉన్నట్లు తెలిసింది.

©️ VIL Media Pvt Ltd.

2023-03-17T17:27:46Z dg43tfdfdgfd